మంచు తుఫాన్ ఆయా దేశాల్లో మిగిల్చిన విషాదాలివే..

by Disha Web Desk 4 |
మంచు తుఫాన్ ఆయా దేశాల్లో మిగిల్చిన విషాదాలివే..
X

దిశ, వెబ్ డెస్క్: హిమ విస్ఫోటం అమెరికాను వణికిస్తోంది. మంచు తుఫాన్ కారణంగా అమెరికా జనజీవనం స్తంభించిపోయింది. సరస్సులో పడి గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు చనిపోవడం విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత జారిపడి సరస్సులో గల్లంతయ్యారు. అమెరికాలో ఉన్న తమ వారు ఎలా ఉన్నారో అని మన దేశంలో చాలా మంది టెన్షన్ పడుతున్నారు. అమెరికాలో చోటు చేసుకున్న మంచు తుఫాన్ ఘటనలు గతంలోను కొన్ని దేశాల్లో చోటు చేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

ఇరాన్‌‌లో మంచుతుఫాన్ బీభత్సం..

ఇరాన్‌లో 1972లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్ దాటికి ఏకంగా 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాన్ కారణంగా 26 ఫీట్ల మంచు కురిసింది. 200 గ్రామాలను పూర్తిగా మంచు కప్పేసింది. వారం రోజుల పాటు కురిసిన మంచు కారణంగా వీస్ కాన్ సిన్ అనే ప్రాంతం పూర్తిగా మంచులో కూరుకుపోయింది.

అఫ్ఘానిస్థాన్‌లో ఇలా..

అఫ్ఘానిస్థాన్‌లో 2008‌లో మంచు తుఫాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. 2008 జనవరి 10న ప్రారంభమైన మంచు తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలకు పడిపోయింది. 180 సెంటిమీటర్ల మంచు కురిసింది. ఈ మంచు తుఫాన్ కారణంగా మొత్తం 926 మంది కన్నుమూశారు. చరిత్రలో మూడో అతి పెద్ద మంచు తుఫాన్‌గా ఈ విషాదం నిలిచింది. మంచు తుఫాన్ కారణంగా లక్ష గొర్రెలు, మేకలు చనిపోయాయి. 3,15,000 పశువులు మృత్యువాత పడ్డాయి.

కలవరపెడుతున్న బాంబ్ సైక్లోన్..

బాంబ్ సైక్లోన్ మాదిరే 1888లో అమెరికాలో తీవ్ర మంచు తుఫాన్ సంభవించింది. ఆ ఘటనలో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 1900లో గాల్వెస్టన్ హరికేన్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా నిలిచింది. తుఫాన్ కారణంగా సుమారు 8వేల మంది మరణించారు.1950, 1993లో అమెరికాలో సంభవించిన తుఫానుల్లో 300 మంది మృతి చెందారు. 1996లో ఏర్పడ్డ మంచు తుఫాన్ లో 154 మంది మృతి చెందారు. 2016లో వచ్చిన మంచు తుఫాన్ కారణంగా 55 మంది మరణించారు.

ప్రస్తుతం అమెరికాను బాంబ్ సైక్లోన్ కలవరపెడుతోంది. కెనడాలోను దీని ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికాలో ఈ హిమోత్పాతానికి మృతుల సంఖ్య 66‌కు చేరింది. అతి శీతల ప్రభావంతో ఇళ్లు, రోడ్లు, హోటళ్లు అన్ని మంచులో కూరుకుపోయాయి. మంచు ప్రభావం 20 కోట్ల మందిపై ఉంటుందని అధికారులు తెలిపారు. మంచు తుఫాన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా నగరాల్లో -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. నప్లెస్‌లో -52 డిగ్రీల చలి నమోదైంది. మియామీలో కూడా -50 డిగ్రీల చలి రికార్డు అయింది. గంటకు 71 మైళ్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. 15లక్షల మంది విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 41 సంవత్సరాల క్రితం అమెరికాలో సర్కస్ తుఫాన్ కారణంగా 14 ఇంచుల మేర మంచు కురిసింది.

Next Story

Most Viewed